పరలోకమునుండి సూచన కోరుట
16 1 పరిసయ్యులును సద్దూకయ్యులును ఆయనను శోధించుటకు వచ్చి, పరలోకమునుండి ఒక సూచన తమకు చూపమని ఆయనను అడిగిరి. 2 ఆయన ఇట్లనెను, "సాయంకాలమైనప్పుడు, 'ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వాతావరణము నిర్మలముగా ఉండును' అని మీరు చెప్పుదురు. 3 "ఉదయమందైతే, 'ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చును' అని చెప్పుదురు. ఆకాశ రూపమును వివరించుట మీకు తెలియును గాని, కాలముల సూచనలను వివరింపలేరు. 4 "దుష్టమైన వ్యభిచార తరము సూచన వెదకుచున్నది, అయితే యోనా సూచన తప్ప మరి యే సూచనయు దానికి ఇయ్యబడదు." అప్పుడు ఆయన వారిని విడిచి వెళ్లిపోయెను.
అబద్ధ బోధ యొక్క పులిసిన పిండి
5 శిష్యులు అవతలి ఒడ్డుకు వచ్చినప్పుడు, రొట్టె తెచ్చుటకు మరచిపోయిరి. 6 యేసు వారితో, "పరిసయ్యుల సద్దూకయ్యుల పులిసిన పిండి విషయమై జాగ్రత్తగా ఉండి, ఎచ్చరికగా ఉండుడి" అని చెప్పెను.
7 వారు తమలో తాము దీనిగూర్చి తర్కించుకొని, "మనము రొట్టె తేలేదు గనుకనే" అని చెప్పుకొనిరి.
8 యేసు దీనిని ఎరిగి, "అల్పవిశ్వాసులారా, మీయొద్ద రొట్టె లేదని మీలో మీరు ఎందుకు తర్కించుకొనుచున్నారు? 9 "మీరింకను గ్రహింపలేదా? అయిదువేల మందికి అయిదు రొట్టెలను, మీరు ఎన్ని గంపలు ఎత్తితిరో జ్ఞాపకము లేదా? 10 "లేక నాలుగువేల మందికి ఏడు రొట్టెలను, మీరు ఎన్ని గంపలు ఎత్తితిరో జ్ఞాపకము లేదా? 11 "నేను రొట్టెనుగూర్చి మీతో మాటలాడలేదని మీరెట్లు గ్రహింపకయున్నారు? పరిసయ్యుల సద్దూకయ్యుల పులిసిన పిండి విషయమై జాగ్రత్తగా ఉండుడి."
12 అప్పుడు ఆయన రొట్టెలో వేయు పులిసిన పిండి విషయమై కాదు గాని, పరిసయ్యుల సద్దూకయ్యుల బోధ విషయమై జాగ్రత్తగా ఉండుమని తమతో చెప్పెనని వారు గ్రహించిరి.
పేతురు తండ్రి కుమారుని ఒప్పుకొనుట
13 యేసు కైసరయ ఫిలిప్పి ప్రాంతమునకు వచ్చినప్పుడు, "మనుష్యకుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు?" అని తన శిష్యులను అడిగెను.
14 వారు, "కొందరు బాప్తిస్మమిచ్చు యోహానని, మరికొందరు ఏలీయా అని, ఇంక కొందరు యిర్మీయా అని లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు" అనిరి.
15 ఆయన వారితో, "అయితే నేనెవడనని మీరు చెప్పుచున్నారు?" అనెను.
16 సీమోను పేతురు, "నీవు క్రీస్తువు, జీవముగల తండ్రి కుమారుడవు" అని చెప్పెను.
17 యేసు, "యోనా కుమారుడవైన సీమోనూ, నీవు ధన్యుడవు! ఏలయనగా రక్తమాంసములు కాదు గాని పరలోకమందున్న నా తండ్రి దీనిని నీకు బయలుపరచెను. 18 "మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదునని నేను నీతో చెప్పుచున్నాను; సమాధి ద్వారములు దానిని జయింపనేరవు. 19 "మన తండ్రి రాజ్యము యొక్క తాళపు చెవులను నీకిచ్చెదను; నీవు భూమిమీద దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడియుండును, భూమిమీద దేనిని విడుదల చేయుదువో అది పరలోకమందు విడుదల చేయబడియుండును." a a v19 "బంధించుట, విడుదల చేయుట" అను మాట, వస్తువులను నిషిద్ధమని లేక అనుమతించబడినవని ప్రకటించుటకు యూదుల రబ్బీల నుడికారము. 20 అప్పుడు తాను క్రీస్తునని ఎవరితోను చెప్పవద్దని ఆయన శిష్యులకు కఠినముగా ఆజ్ఞాపించెను.
కుమారుడు శ్రమపడి లేవవలెను
21 ఆ సమయమునుండి యేసు, తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక శ్రమలు పొంది, చంపబడి, మూడవ దినమున లేపబడవలెనని తన శిష్యులకు తెలియజేయనారంభించెను.
22 పేతురు ఆయనను ఒక ప్రక్కకు తీసికొనిపోయి, "ప్రభువా, ఇది ఎన్నటికిని కాకూడదు! ఇది నీకు ఎన్నటికిని సంభవింపదు" అని ఆయనను గద్దింపనారంభించెను.
23 అయితే ఆయన తిరిగి పేతురుతో, "సాతానూ, నా వెనుకకు పొమ్ము! నీవు నాకు అభ్యంతరముగా ఉన్నావు; ఏలయనగా నీ మనస్సు మన తండ్రి లక్ష్యపెట్టువాటిమీద కాదు గాని మనుష్యులు లక్ష్యపెట్టువాటిమీద ఉన్నది" అని చెప్పెను.
24 అప్పుడు యేసు తన శిష్యులతో, "ఎవడైనను నా వెంబడి రాగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తికొని, నన్ను వెంబడింపవలెను. 25 "తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, అయితే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని పొందును. 26 "ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకొనినయెడల వానికేమి ప్రయోజనము? లేక ఒకడు తన ఆత్మకు ప్రతిగా ఏమి ఇచ్చును? 27 "మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతోకూడ రాబోవుచున్నాడు; అప్పుడు ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. 28 "మనుష్యకుమారుడు తన రాజ్యములో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడని కొందరు ఇక్కడ నిలిచియున్నారని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."